AP NorthCoastal and VisakhaPatnam people suffered with ECoR bad and illogical quota deeds
click here
‘డైనమిక్’ దోపిడీ!
హమ్సఫర్ రైళ్లలో కోటా తక్కువ.. బాదుడు ఎక్కువ
ఈ...
more... నెల 24న 22833 నెంబరుగల హమ్సఫర్ రైలు (మొత్తం థర్డ్ఏసీ)లో భువనేశ్వర్ నుంచి కృష్ణరాజపురం (బెంగళూరు)కు 392 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీటు ధర రూ. 1890. ఇందులో డైనమిక్ పేరిట అదనపు ఛార్జి రూ. 224. అదే రోజు.. అదే రైలుకు.. : విశాఖ నుంచి కృష్ణరాజపురానికి వెయిటింగ్లిస్టు 1గా ఉంది. ధర చూస్తే.. రూ. 2300. ఇందులో అదనంగా పడిన డైనమిక్ ఛార్జీ రూ. 885. వాస్తవానికి విశాఖ నుంచి ఛార్జీ తక్కువగా ఉండాలి. కోటాలో జరుగుతున్న మాయ కారణంగా ఇంతటి భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. డైనమిక్ ఫేర్ పేరుతో దోపిడీ ఇది.
విశాఖపట్నం: హమ్సఫర్ రైళ్లకు ప్రత్యేకమైన డైనమిక్ ఫేర్ను నిర్ణయించారు. ఈ రైలులో 800 సీట్లు ఉన్నాయనుకుంటే.. 1వ నెంబరు సీటునుంచే 1.15 రెట్ల ధరను అదనంగా నిర్ణయిస్తారు. దీనికి జీఎస్టీ అదనం. 50 శాతం సీట్లు పూర్తయ్యాక.. ఆ తర్వాతి ప్రతీ 10 శాతం సీట్లకు మూలధర మీద 10 శాతం, దీనికి అదనంగా జీఎస్టీ వసూలు చేస్తారు. సీట్ల డిమాండ్ పెరిగే కొద్దీ బాదుడు పెరుగుతూనే ఉంటుంది. అంటే ఆయా రైల్వేస్టేషన్లకు కేటాయించిన కోటా తరుగుతున్న కొద్దీ ఆ స్టేషన్తో పాటు దాని కింద వచ్చే స్టేషన్ల పైన డైనమిక్ ఫేర్ పేరిట తీవ్ర భారం పడుతుంది.
కోటాలో జరిగిన మాయ ఏమిటంటే..
హవ్డా, భువనేశ్వర్ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా బెంగళూరు వైపు వెళ్తున్న హమ్సఫర్ రైళ్లలో ఒక రకమైన దోపిడీనే జరుగుతోంది. వీటి సీట్ల కోటాల్లో అగ్రభాగం పశ్చిమబంగా, ఒడిశా రాష్ట్రాలు తన్నుకుపోయాయి. మన రాష్ట్రం నుంచి ప్రయాణించే వారిపైనే భారీ రుసుం పడుతోంది. ఆ రెండు రాష్ట్రాల్లో రైళ్లు ఆగే స్టేజీలు ఎక్కువే, సీట్ల కేటాయింపూ ఎక్కువగా ఉంది. ఏపీకి వచ్చేసరికి సీట్ల కోటాను బాగా తగ్గిస్తూ వచ్చారు.
రైలునెంబరు 22887.. హవ్డా నుంచి యశ్వంతాపూర్ వెళ్తున్న ఈ రైలులో హవడాకు 800కు పైబడి సీట్లు కేటాయించారు. ఆ తర్వాత కటక్కు 26, విశాఖకు 70 కేటాయించారు. ఆ తర్వాత కేటాయింపులు లేవు. ఇక్కడ హవ్డా పరిధిలో టికెట్లు బుక్ చేసుకునేవారికి 400 సీట్ల వరకు (50 శాతం) పెద్దగా భారం పడదు. తర్వాత ప్రతీ 10 శాతం సీట్లకు 10 శాతం ధర పెరుగుతూ పోతుంది. వారికి సీట్లు కూడా భారీగా ఉన్నాయి కాబట్టి పెద్దగా కంగారు పడక్కర్లేదు. విశాఖ నుంచి కేవలం 70 సీట్లే ఇచ్చారు. అంటే విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, ఒంగోలు, రేణిగుంట ప్రాంతాల నుంచి టిక్కెట్ తీసుకున్నవారందరికీ ఇవే సీట్లు. ఇందులో 50 శాతం సీట్లు చాలా త్వరగా అయిపోతున్నాయి. ఆ తర్వాత భారీగా డైనమిక్ ఫేర్ పడుతోంది. హవ్డాలో రైలు ఛార్ట్ తయారయ్యే సమయానికి సీట్లు ఏమైనా మిగిలితేనే ఏపీలోని స్టేషన్ల వారికి ఇస్తారు, లేకపోతే లేదు.
రై.నెం 22889.. హవ్డా నుంచి విజయవాడ వరకు ఈ హమ్సఫర్ రైలు వెళ్తుంది. హవ్డాకు 800 పైబడి సీట్లు కేటాయించారు. కటక్కు 26 ఇచ్చారు. ఆ తర్వాత మన రాష్ట్రంలోని ఏ ఒక్క రైల్వేస్టేషన్కూ కోటా ఇవ్వలేదు. ఇవన్నీ కటక్ స్టేషన్కు ఇచ్చిన 26 కోటా మీదే ఆధారాపడాల్సి వస్తోంది. 13 సీట్లు పూర్తయితేనే డైనమిక్ ఛార్జి బాదుడు పడుతోంది. ఇదే రైలు తిరుగుప్రయాణంలోనూ భువనేశ్వర్కే అనుకూలంగా ఉండేలా కోటాను మలిచారు. విజయవాడ నుంచి 700పైగా సీట్లు కోటా ఇస్తే, భువనేశ్వర్ నుంచి 110కి పైగా ఇచ్చారు. మధ్యలోని విశాఖను పట్టించుకోలేదు.
రై.నెం 12504.. కామాఖ్య నుంచి బెంగళూరు కంటోన్మెంట్కు వెళ్లే ఈ హమసఫర్ రైలులో కామాఖ్యకు 700 సీట్లు కేటాయించారు. ఆ తర్వాత మాల్దా స్టేషన్కు 20, హవ్డాకు 79, భువనేశ్వర్కు 38 సీట్లు ఇచ్చారు. ఏపీకి మొండిచేయే దక్కింది. భువనేశ్వర్కు ఇచ్చిన 38 కోటాలోనే పంచుకోవాల్సిన పరిస్థితి.
రై.నెం 22833 భువనేశ్వర్-కృష్ణరాజపురం హమ్సఫర్కు.. భువనేశ్వర్ నుంచి 680, విశాఖ నుంచి 110, విజయవాడ 60 దాకా సీట్ల కేటాయింపులు ఇచ్చారు.
ఏపీ నుంచి మొదలైతేనే..
రైల్వేశాఖ తీరుతో.. కోటా తగ్గే కొద్దీ ఏపీ ప్రయాణికులపై రూ. 600 నుంచి రూ. 1200 వరకు భారం పడుతోంది. ఇందులో జీఎస్టీ రూ. 90 నుంచి రూ. 120 వరకు పడుతోంది. ఏపీలోని రైల్వేస్టేషన్కు కోటాలు పెంచితేనే న్యాయం జరుగుతుందని ప్రయాణికులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని వారు ట్విట్టర్ ద్వారా రైల్వే బోర్డు దృష్టికీ తీసుకెళ్తున్నారు. కేటాయింపులు లేకపోవడం ఒక అన్యాయమైతే, ఏపీ నుంచి మొదలయ్యే రైళ్లు ఇవ్వకపోవడం మరొక అన్యాయమని అంటున్నారు. ‘ఈ విషయమై తూర్పుకోస్తా రేల్వేకు, రైల్వేబోర్డుకు ట్విట్టర్లో ఫిర్యాదులు చేశాం. నిబంధనల ప్రకారమే కోటాను ఇచ్చామని, దాని ప్రకారమే డైనమిక్ ఛార్జీలు పడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇదెక్కడి న్యాయమో అర్థం కావడంలేదు’ అని దువ్వాడ రైల్వేస్టేషన్ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ప్రతినిధి కె.ఈశ్వర్ తెలిపారు.
కార్డు వాడేలోపే మారుతున్న స్లాబ్
కేటాయింపుల్లో సీట్లు తగ్గిపోయే కొద్దీ డైనమిక్ ఛార్జి పెరుగుతోంది. ఆన్లైన్లోగానీ, టికెట్ బుకింగ్ కౌంటర్లలోగానీ.. టికెట్ కోసం డెబిట్కార్డు వినియోగించేలోపే ధరలో మార్పులు వస్తున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఈ రైళ్లలో వెళ్లేందుకు ఆసక్తి చూపడంలేదు. గత కొన్నాళ్లుగా ఈ రైళ్లలో రద్దీని చూస్తే సగం వరకు ఖాళీ సీట్లు ఉంటున్నట్లుగా రైల్వే అధికారులు నివేదిస్తున్నారు.