-దేశవ్యాప్త ర్యాంకింగ్లోనాలుగో స్థానం
-ఐఆర్సీటీసీ సర్వేలో వెల్లడి
-తెలంగాణలో ఎనిమిది స్టేషన్లకు ర్యాంకులు
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రైల్వేస్టేషన్లలో పరిశుభ్రతపై ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) దేశవ్యాప్తంగా జరిపిన సమగ్ర సర్వేలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు టాప్ 5లో స్థానం దక్కింది. రెండో లెవెల్కు ఎంపికై స్వచ్ఛతలో జోనల్ హెడ్క్వార్టర్స్ విభాగంలో 4వ ర్యాంకు సాధించింది. భారతీయ రైల్వేలలో స్వచ్ఛతపై ఐఆర్సీటీసీ.. మెజర్స్ టీఎన్ఎస్ ప్రైవేటు ఇండియా లిమిటెడ్ ద్వారా సర్వే చేయించగా సికింద్రాబాద్ జంక్షన్ స్టేషన్కు ఈ ర్యాంకు దక్కింది.
దేశవ్యాప్తంగా...
more... 7,112 స్టేషన్లు ఉండగా అందులో ఏ1, ఏ క్యాటగిరీలకు చెందిన 407 స్టేషన్లపై సర్వే చేయించారు. టాయిలెట్ల పరిశుభ్రత, కోచ్లలో బయో టాయ్లెట్లు, ఫిర్యాదుల పరిష్కారం, డస్ట్బిన్ల ఏర్పాటు, స్టేషన్ల నిర్వహణ, మౌలిక సౌకర్యాలు, సర్వీస్ ఇంప్రూవ్మెంట్ వంటి 47 అంశాల్లో సర్వే చేశారు. సర్వే చేసిన స్టేషన్లలో 75 ఏ1 స్టేషన్లు ఉండగా, ఏ గ్రేడ్ స్టేషన్లు 332 ఉన్నాయి. సర్వేలో స్కోరు ఆధారంగా 5 లెవెల్స్గా స్టేషన్లను విభజించారు. 0 నుంచి 1000 స్కోరు నిర్ణయించి సర్వేలో ఉత్తమంగా ఉన్న స్టేషన్లకు ఎక్కువ స్కోరు ఇచ్చి లెవెల్స్గా విభజించారు. ఇందులో 105 స్టేషన్లు క్లీనింగ్లో లెవెల్ 1, 2 సాధించగా, 166 స్టేషన్లు లెవెల్ 3కు ఎంపికయ్యాయి. 136 స్టేషన్లు లెవెల్ 4, 5 గా సర్వేలో తేలాయి. దీనికోసం సుమారు 45 బృందాలు విడతలవారీగా సర్వే చేశాయి. సర్వేలో భాగంగా ఏ1 క్యాటగిరీకీ చెందిన స్టేషన్ల ర్యాంకు తేల్చడానికి ప్రతీ స్టేషన్లో 400 మంది ప్రయాణికులను ఇంటర్వ్యూ చేశాయి. అదేవిధంగా ఏ గ్రేడ్ రైల్వే స్టేషన్ల విషయానికి వస్తే 300 మందిని ఇంటర్వ్యూ చేసి వారి అభిప్రాయాలను రికార్డు చేశాయి. అత్యంత పకడ్బందీగా చేసిన ఈ సర్వేలో దక్షిణమధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలోని 8 స్టేషన్లు ర్యాంకులు దక్కించుకున్నాయి. ఇందులో 2.. ఏ1 క్యాటగిరీ రైల్వే స్టేషన్లుకాగా మిగతావి ఏ గ్రేడ్ రైల్వేస్టేషన్లు. సేవల విషయంలో సర్వే చేసిన టీఎన్ఎస్ సంస్థ 2,734 మంది కూలీలను, 2,186 మంది రైల్వే అధికారుల అభిప్రాయాలను కూడా తీసుకుంది. వారి అభిప్రాయాలను వీడియో రికార్డు చేసింది.
లెవెల్స్ ఎంపిక ఇలా..
ఉత్తమ స్టేషన్ల ఎంపికకు సర్వేలో 0 నుంచి 1000 మార్కులను నిర్దేశించారు. 750కి పైగా స్కోరు వస్తే మొదటి లెవెల్గా, 600 నుంచి 749 స్కోరును రెండో లెవెల్గా, 500 నుంచి 599 వస్తే మూడో లెవెల్గా, 400 నుంచి 499 వస్తే నాలుగో లెవెల్గా, 400కన్నా తక్కువగా స్కోరు వస్తే 5 వ లెవెల్ స్టేషన్లుగా ఎంపిక చేశారు. దక్షిణమధ్య రైల్వేలో 36 స్టేషన్లు సర్వే చేయగా లెవెల్ 2గా 7 స్టేషన్లు, లెవెల్ 3 కింద 19 స్టేషన్లు, లెవెల్ 4, 5 ల కింద 10 స్టేషన్లు ఎంపికయ్యాయి. ఇదే స్కోరు ఆధారంగా సికింద్రాబాద్ జంక్షన్ 606 స్కోరు సాధించి లెవెల్ 2కు ఎంపికైంది.
ఓవరాల్ ర్యాంకింగ్లోనూ..
పట్టణాలకు శోభ తేవడంలోనూ తెలంగాణలో ఉన్న రైల్వేస్టేషన్లు ఓవరాల్ ర్యాంకింగ్ సాధించాయి. హైదరాబాద్ డివిజన్లోని కాచిగూడ 66వ ర్యాంకు, సికింద్రాబాద్ 96వ ర్యాంకు, మంచిర్యాల 188, హైదరాబాద్ స్టేషన్ 210, నిజామాబాద్ 219 ర్యాంకు సాధించాయి. అత్యధిక సంఖ్యలో ప్రయాణికులు వచ్చే 75 ఏ గ్రేడు స్టేషన్ల విషయానికి వస్తే కాచిగూడ 15వ ర్యాంకు, సికింద్రాబాద్ 23వ ర్యాంకు, హైదరాబాద్కు 46వ ర్యాంకు వచ్చింది.