Surveillance cameras along the track.
******************************
రైల్రోకో చట్ట విరుద్దం..నిషేధం
* ఉల్లఘిస్తే ఐదేళ్ళు జైలుశిక్ష
* రైల్వేట్రాక్పై నిఘా కెమెరాలు: రూరల్ ఎస్పీ
విశాఖపట్నం,...
more... ఆగస్టు 10: రాష్ట్ర విభజన ప్రకటనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర జేఏసి ఆదివారం తలపెట్టిన రైల్రోకో పూర్తిగా చట్ట విరుద్ధమని నగర పోలీసు కమిషనర్ శివధరరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆందోళన కార్యక్రమాలు పూర్తి శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరపాలని, రైల్రోకో పూర్తిగా చట్టవిరుద్ధంగా పేర్కొన్నారు. దీనిలో ఏ ఒక్కరూ భాగస్వాములు కావద్దని విజ్ఞప్తి చేశారు. రైల్వే చట్టం-1989, ఇండియన్ రైల్వే చట్టం ప్రకారం రైల్వే ట్రాక్ ప్రదేశం పూర్తిగా నిషిద్దమని, రైల్వేస్టేషన్లోపలకి అక్రమంగా ప్రవేశించడం రైళ్ళను నిలిపివేయడం, రైలు పట్టాలపై కూర్చోవడం, రైళ్ళపై రాళ్ళు విసరడం, రైలును ఆపడంలో భాగంగా ట్రాక్పై రాళ్లు, ఇతర వస్తువులను పెట్టడం, రైలు స్లీపర్లను తొలగించడం, లూజు చేయడం, సిగ్నల్ లైట్లకు ఆటంకం కలుగచేయడం, రైల్వే ఆస్తుల ధ్వంసం, రైలు ప్రయాణికులను గాయపర్చడం, ప్రమాదం కలిగించడం, రైలు ప్రయాణం జరుగకుండా చేయడం వంటివి వాటికి పాల్పడితే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాగే రైల్వేక్రాసింగ్లు, స్టేషన్ల వద్ద దుశ్చర్యలకు పాల్పడినా తీవ్రమైన నేరం, చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. వీటికి పాల్పడిన వారికి ఐదేళ్ళపాటు శిక్షార్హులవుతారని, బెయిల్ రాని నేరంగా పరిగణించబడుతుందన్నారు. విద్యార్థులు, యువత ఈ నేరాలకు పాల్పడితే వారి భవిష్యత్పై ప్రభావం చూపుతుందన్నారు. రైల్వే అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, ప్రయాణికులు టికెట్లు కొనుగోలు చేయకుండా ఆటంకపరిచినా తీవ్రమైన నేరమే అవుతుందన్నారు. అందువల్ల ఆందోళనకారులు ఎటువంటి పరిస్థితుల్లోను రైల్రోకోను జరుపరాదని హెచ్చరించారు. రైల్వేస్టేషన్లు, రైల్వేట్రాక్ పరిదిలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఆందోళనకారులు గుమిగూడినా, బృందాలుగా తిరిగినా, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటం వంటివి నిషేధమన్నారు. ఇటువంటి వారిని ఉపేక్షించేదిలేదని, క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రైల్రోకో వంటి చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడకుండా ఆందోళనలు పూర్తిగా శాంతియుతంగా జరపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
* రైల్వేట్రాక్పై నిఘా కెమెరాలు
రైల్రోకో పేరుతో రైల్వే ఆస్తులను ధ్వంసం చేసినా, రైలు ప్రయాణాన్ని అడ్డుకున్నా, రైళ్ళ రాకపోకలకు అంతరాయం కలిగించిన చట్టవిరుద్ధమని విశాఖ జిల్లా ఎస్పీ విక్రమ్జిత్ దుగ్గాల్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రైల్వేట్రాక్ అంతటా నిఘా కెమెరాలను ఉంచడమైందని, ఎవరైనా హింసాత్మక చర్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
రైల్వేస్టేషన్లో పోలీసు బలగాల మోహరింపు
* కశింకోట నుంచి కొత్తవలస వరకు
విశాఖపట్నం, ఆగస్టు 10: రైల్రోకోలో భాగంగా విశాఖ రైల్వేస్టేషన్ నుంచి పలుచోట్ల రైళ్ళను నిలిపివేసే పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా ఆందోళనకారులను నిలవరించేందుగాను భారీగా పోలీసు బలగాలు మొహరించాయి. కశింకోట నుంచి కొత్తవలస వరకు 800 మందితో భారీగా బందోబస్త్ నిర్వహిస్తున్నారు. ఇందులో పోలీసు కానిస్టేబుళ్ళు-399, హెడ్ కానిస్టేబుళ్ళు-119, మహిళా కానిస్టేబుళ్ళు-153, ఎస్ఐలు-69, సిఐ-29 మంది పోలీసు బృందాలుగా ఏర్పడి ప్రతి రైల్వేస్టేషన్, హాల్ట్లు, రైల్వేక్రాసింగ్ల వద్ద గట్టి బందోబస్త్ ఉంటుందని జిఆర్పి సిఐ ఏ.పార్ధసారధి తెలిపారు. ట్రాక్పై నిఘా మరింత కట్టుదిట్టం చేసామని, రైళ్ళను ఒక్క నిమిషయం కూడా నిలుపుకుండా ఆందోళనకారులపై కఠినంగా వ్యవహరించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇది కాకుండా ముఖ్యమైన రైళ్ళకు ఆర్ఫీఎఫ్, జిఆర్పి, నగర పోలీసులతో గట్టి నిఘా ఉంటుందన్నారు.